విద్యార్థులపై పోలీసుల లాఠీ చర్యకు వ్యతిరేకంగా ఈనెల 15వ తేదీన తాసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన - చిలకలూరిపేట విద్యార్థి JAC
చిలకలూరిపేట: అనేక సంవత్సరాలుగా లక్షలాది మంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దినటువంటి ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వం కొనసాగించాలని..చిలకలూరిపేట విద్యార్థి జెఎసి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు సిద్దు , జగదీష్ కోరారు. శుక్రవారం స్థానిక ఎన్ ఆర్ టీ సెంటర్ లో ఉన్నటువంటి విద్యార్థి జేఏసీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎయిడెడ్ విద్యాసంస్థలను యధావిధిగా కొనసాగించాలని, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎయిడెడ్ విద్యాసంస్థల్లో లోపాలు ఉంటే ప్రభుత్వం సరిదిద్దాలి కానీ పూర్తిగా వ్యవస్థను తీసివేయడం సమంజసం కాదని తెలిపారు. రాష్ట్రంలో పలు చోట్ల ఈ అంశంపై నిరసన తెలియజేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేయటం అన్యాయమన్నారు. పోలీసుల లాఠీఛార్జి కి వ్యతిరేకంగా నవంబర్ 15వ తేదీన చిలకలూరిపేట మండల తాసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసి అనంతరం తాసిల్దార్ కి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని విద్యార్థులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో విద్యార్థి జేఏసీ నాయకులు బొంతా భగత్ సింగ్,బి.సాయి, ఎం.ఫణి, కిరణ్ ,వి.మణి , యం.నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.