ఈనెల 14న చిలకలూరిపేటకు పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్
చిలకలూరిపేట:- నరసరావుపేట పార్లమెంట్ వైయస్సార్సీపీ ఇన్ చార్జ్ గా నియమితులైన అనిల్ కుమార్ యాదవ్ గారికి ఈనెల 14వ తేదీ బుధవారం ఘన స్వాగతం పలుకుతున్నట్లు జలవనరులశాఖామంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఈ మేరకు నరసరావుపేట మునిసిపల్ గెస్ట్ లో బుధవారం మీడియా సమావేశంలో జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు, వైస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి, చిలకలూరిపేట వైయస్సార్ సీపీ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు అంబటి రాంబాబు మాట్లాడుతూ నరసరావుపేట పార్లమెంట్ కు బీసీ అభ్యర్థిని కేటాయించడం సీఎం జగన్ తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయమని హర్షం వ్యక్తం చేశారు. నరసరావుపేట పార్లమెంటు పరిధిలో అభ్యర్థుల మార్పులు అయిపోయాయని.. ప్రస్తుతం ఉన్న నాయకులు పోటీ చేయబోతున్నారని తెలిపారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఓసీ అభ్యర్థులు మాత్రమే ఉన్నారని.. అందుకే పార్లమెంట్ స్థానానికి బీసీ అభ్యర్థిని తీసుకు రావడం జరిగిందని వివరించారు.
ప్రభుత్వ విప్, పల్నాడు జిల్లా అభివృద్ధి మండలి చైర్మన్, పల్నాడు జిల్లా వై.యస్.ఆర్.సి.పి అధ్యక్షులు, మాచర్ల శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 14న నరసరావుపేటలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులు మరియు పార్టీ సానిభూతిపరులకు పిలుపునిచ్చారు. నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా బీసీ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ కు ఘన స్వాగతం పలుకుతూ సభను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చారటే మాటపై నిలిచే వ్యక్తి అని ఎన్నడు లేని విధంగా నరసరావుపేట పార్లమెంటు స్థానాన్ని బీసీకి కేటాయించడం గొప్ప విషయం అని అన్నారు..ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు కార్యకర్తలు బీసీ అభ్యర్థి అనిల్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. 2019లో మాదిరిగానే 2024లో కూడా జిల్లాలోని 7నియోజకవర్గలు విజయం సాధించ బోతున్నట్లు చెప్పారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్నాయుడు మాట్లాడుతూ.. ఈనెల 14వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు అనిల్కుమార్ యాదవ్ నెల్లూరు నుండి రోడ్డు మార్గాన బయలుదేరుతారని తెలిపారు. మధ్యాహ్నం 1:30 గంటలకు చిలకలూరిపేట పట్టణంలోని అడ్డరోడ్డు సెంటర్ కు చేరుకుంటారన్నారు. అక్కడ తన ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు అనిల్కుమార్ యాదవ్కు ఘన స్వాగతం పలకనున్నట్లు చెప్పారు. 2:30 గంటలకు కోటప్పకొండలో త్రికోటేశ్వరుని దర్శనం చేసుకోవడం జరుగుతుందన్నారు. 4 గంటలకు కోటప్పకొండ నుంచి బయలుదేరి నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం చేరుకుంటారన్నారు. అక్కడ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి నరసరావుపేట పల్నాడు బస్స్టాండ్ సెంటర్లో బహిరంగ సభ వద్దకు చేరుకుంటారని తెలిపారు. స్వాగత ర్యాలీ, బహిరంగ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతి పరులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.