చిలకలూరిపేట:- గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఉచిత ఫిజియోథెరపీ సేవలు - పట్టణ ప్రజలు సేవలు సద్వినియోగం చేసుకోవాలి
చిలకలూరిపేట : చిలకలూరిపేట పట్టణంలోని చీరాల రోడ్డులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా ఫిజియోథెరపి సేవలు అందుబాటులోకి వచ్చినట్లు డాక్టర్ భవ్యశ్రీ తెలిపారు. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని అఖిల భారత అవినీతి నిర్మూలన , వినియోగదారుల సంఘం ఆధ్వర్యంలో చిలకలూరిపేట ఏరియా ప్రభుత్వవైద్యశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫిజియోథెరపీ సేవలపై స్థానిక బాపూజీ వృద్ధాశ్రమం ఆవరణలో మంగళవారం అవగాహనసదస్సు నిర్వహించారు. వినియోగదారుల సంఘం అధ్యక్షుడుమురికిపూడి ప్రసాద్ అధ్యక్షత వహించారు. ప్రభుత్వ ఏరియా వైద్యశాల ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ భవ్యశ్రీ మాట్లాడుతూ వృద్దులకు వయసు రీత్యా వచ్చే నొప్పులు, పక్షవాతం వచ్చిన వారికి, షుగర్ పేషెంట్లకు, బీపీ పేషెంట్లకు వచ్చే నొప్పుల గురించి వివరించారు. మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు, మెడ నొప్పులు, ఛాతి నొప్పి, ఎలర్జీలు గురించి తెలియజేశారు. వయసుతో నిమిత్తం లేకుండా డైట్ చార్ట్ ఇస్తామని, గుండె సంబంధిత వ్యాధుల వారికి E.C.G చేస్తామని, ప్రభుత్వ ఆసుపత్రిలో వృద్ధులకు ప్రత్యేక క్యు ఉంటుందని ఎవరూ నిలబడనవసరం లేదని వచ్చిన వెంటనే వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. నొప్పులు ఎక్కువగా ఉన్నవారు తమను సంప్రదిస్తే వెంటనే వైద్య సహాయం చేస్తామని ప్రధాన మంత్రి మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా అన్ని వయసుల వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల నొప్పులకు సంబంధించిన పరికరాలు, మెషిన్ అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వ వైద్యశాలలో అందిస్తున్న సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం ఏఎన్ఎం పరమేశ్వరి, వినియోగదారుల సంఘం గౌరవ సలహాదారు ఆరాధ్యుల రామకృష్ణ పాల్గొన్నారు.